ఆదివాసీ గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తూ మినీ అంగన్వాడీ టీచర్ బానోత్ జ్యోతి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని లక్ష్మిదేవిపల్లి మండలం గట్టుమల్ల పంచాయతీ పరిధిలోని మినీ చతీష్ఘడి అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న బానోత్ జ్యోతి కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి బాలామృతం, గుడ్లు, పాలు అందజేస్తుంది. దీనికి తోడు ఆదివాసీ పిల్లలకు స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో తన ఫోన్ ద్వారా వారికి పొడుపు కథలు, బొమ్మలు, కథల వీడియోలను చూపిస్తూ ఆన్లైన్ పాఠాలను వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇంటింటి తిరిగి చిన్నారులకు ఆన్లైన్ పాఠాలను బోధించడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.